కరోనా నేపథ్యంలో అనేక కంపెనీలు ఇప్పటికే భిన్న రకాల మాస్కులను తయారు చేసి జనాలకు అందిస్తున్నాయి. ఇక మొబైల్స్ తయారీ కంపెనీ షియోమీ కూడా గతంలో ఎయిర్పాప్ పేరిట ఓ మాస్క్ ను విడుదల చేయగా, ఇప్పుడు తాజాగా ఎంఐ కేఎన్95 పేరిట మరో మాస్క్ను విడుదల చేసింది. ఇందులో 4 లేయర్లలో ప్రొటెక్షన్ లభిస్తుంది.
ఎంఐ కేఎన్95 మాస్క్ బయటి భాగంలో ఊలు కాకుండా ఇతర వస్త్రంతో తయారు చేసిన మెటీరియల్ ఉంటుంది. అందువల్ల బయటి నుంచి దుమ్ము, తుంపర్ల అణువులు లోపలికి అంత సులభంగా ప్రవేశించవు. ఈ మాస్క్ను ధరించే వారికి శ్వాస కూడా సరిగ్గా అందుతుంది. అందులో ఎలాంటి సమస్యా ఉండదు. బయటి నుంచి వచ్చే సూక్ష్మ క్రిములను కూడా ఫిల్టర్ చేసే విధంగా లోపలి వైపు ప్రత్యేక ప్రొటెక్షన్ను లేయర్లలో కల్పించారు.
1 నుంచి 5 మైక్రాన్ల సైజ్ ఉండే అణువులను కూడా ఈ మాస్క్ ఫిల్టర్ చేస్తుంది. 95 శాతం వరకు సూక్ష్మ క్రిములను రాకుండా అడ్డుకుంటుంది. ఈ మాస్క్ చాలా తక్కువ బరువును కలిగి ఉంటుంది. అందువల్ల ఎన్ని గంటల పాటు అయినా నిర్విరామంగా దీన్ని ధరించవచ్చు. ఎంఐ కేఎన్ 95 మాస్క్ లకు చెందిన రెండింటి ప్యాక్ ధర రూ.250గా ఉంది. అదే 5 మాస్క్ల ప్యాక్ను అయితే రూ.600కు కొనవచ్చు. ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఎంఐ హోం స్టోర్, రిటెయిల్ స్టోర్స్లో ఈ మాస్క్ లను కొనుగోలు చేయవచ్చు.