తెలంగాణలో పీసీసీ కమిటీల నియామకం రేపిన రచ్చ ముదురుతోంది. పీసీసీ కమిటీల నియామకంపై పలువురు సీనియర్ నేతలు తమ అసంతృప్తిని బాహాటంగా వినిపించిన నేపథ్యంలో ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పీసీసీ కమిటీలో చోటు లభించిన 12 మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. పీసీసీ కమిటీలో టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు విమర్శించిన నేపథ్యంలో ధనసరి సీతక్క, విజయరామారావు, నరేంద్రరెడ్డి, ఎర్ర శేఖర్, చారగొండ వెంకటేశ్, జంగయ్య యాదవ్, డి సాంబయ్య, డాక్టర్ సత్యనారాయణ. పటేల్ రమేష్ రెడ్డి, మల్లేశ్, సుభాష్ రెడ్డి తదితరులు రాజీనామా చేశారు.
తమ రాజీనామా లేఖలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ కు పంపినట్లు తెలుస్తొంది. వలస నేతల వల్లే పదవులు రాలేదని సీనియర్ నేతలు చేసిన వ్యాఖ్యలపై వీరు మనస్థాపానికి గురై రాజీనామా చేసినట్లుగా తెలుస్తొంది. పార్టీకి ఇబ్బందులు రాకూడదనే రాజీనామా చేశామని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. ఉప ఎన్నికల్లో ప్రచారం చేయలని వారు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఏ పదవీ లేకున్నా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు సీతక్క, పార్టీ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి పని చేస్తానని పేర్కొన్నారు. పదవి ఉన్నా లేకున్నా పార్టీ కోసం పని చేస్తామనీ, పదవుల కోసం తాము రాలేదన్నారు. కాంగ్రెస్ సంక్షోభంలో ఉన్నప్పుడే పార్టీలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు సీతక్క.
సీఎల్పీ నేత బట్టి విక్రమార్క నివాసంలో నిన్ని పలువురు సీనియర్ నేతలు బేటీ అయి పీసీసీ కమిటీల నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్శింహ, మధుయాష్కీ, జగ్గారెడ్డి తదితరులు పరోక్షంగా రేవంత్ రెడ్డి నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నాయకులను ఢిల్లీకి రావాల్సిందిగా కబురు వచ్చినట్లు తెలుస్తొంది. వీరితో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ చర్చించనున్నారని ప్రచారం జరుగుతోంది.