Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 130 మంది అభ్యర్ధులు 199 నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో 47 మంది అభ్యర్దుల నామినేషన్లు పరిశీలనలో తిరస్కరణకు గురైయ్యాయి. మిగిలిన 83 మంది అభ్యర్ధుల్లో 36 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 47 మంది అభ్యర్ధులు ఉప ఎన్నిక బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరందరికీ ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది.
ప్రధాన పోటీ ఆ ముగ్గురి మధ్యే
చిన్నా చితకా పార్టీలు, పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్ధులు రంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే అన్నది అందరికీ తెలిసిందే. కుసుగుంట్ల ప్రభాకరరెడ్డి (టీఆర్ఎస్), పాల్వాయి స్రవంతి (కాంగ్రెస్), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (బీజేపీ) లు ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆయా పార్టీల నుండి ముఖ్య నేతలు, అధికార పార్టీ నుండి మంత్రులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 3వ తేదీ జరగనుండగా, నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.