సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గట్డిపోతారం పారిశ్రామిక వాడలో గల హెటిరో డ్రగ్స్ కంపెనీ లోపలికి ఊహించని అతిధి రావడంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఫ్యాక్టరీలోకి ఊహించని అతిధిగా ఓ చిరుత ప్రవేశించడం తీవ్ర కలకలాన్ని రేపింది. కంపెనీలోకి చిరుత రావడం సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. కంపెనీలో చిరుత రావడంతో కార్మికులు ఆందోళన చెందారు. కంపెనీలో విధుల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. చిరుత బయటకు రాకుండా డోర్స్ మూసివేశారు. దీనిపై వెంటనే స్పందించిన యాజమాన్యం చిరుత సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.
ఫ్యాక్టరీ యాజమాన్యం సమాచారంతో నెహ్రూ జూపార్క్ ప్రత్యేక బృందం కంపెనీ వద్దకు చేరుకుంది. పరిశ్రమలోని హెడ్ బ్లాక్ లో చిరుత దాగి ఉన్నట్లుగా సీసీ కెమెరా పుటేజీ అధారంగా గుర్తించారు. కంపెనీ లోపల దాక్కున్న చిరుతను పట్టుకునేందుకు పలు ప్రయత్నాలు చేశారు. తొలుత దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చిన నెహ్రూ జూపార్క్ సిబ్బంది .. చిరుత మత్తులోకి జారుకోగానే ప్రత్యేక బృందం దాన్ని బంధించింది. ఈ ఉదయం చిరుత కంపెనీలోకి ప్రవేశించడంతో చిరుతను బంధించే వరకూ కార్మికులు లోపలకు వెళ్లకుండా బయటే ఉండిపోయారు. జూపార్క్ ప్రత్యేక బృందం చిరుతను బంధించి తరలించడంతో కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు.