TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కొద్ది సేపటి క్రితం 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. హైకోర్టు ఆదేశాలతో సైబరాబాద్ పోలీసులు నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను ఈ మధ్యాహ్నం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించి మరో సారి వాంగ్మూలం సేకరించారు. అనంతరం ముగ్గురు నిందితులకు చేవెళ్ల ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహింపజేసి ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హజరుపర్చారు. ఈ సందర్భంలో నిందితుల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించి రిమాండ్ తరలింపు ఆపాలని కోరారు. నిందితుల తరపు న్యాయవాదుల వాదనలు తోసిపుచ్చిన న్యాయమూర్తి వారికి 14 రోజులు అంటే నవంబర్ 11 వ తేదీ వరకూ రిమాండ్ ఆదేశించారు. దీంతో వారిని చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారన్న అభియోగంపై మొయినాబాద్ ఫామ్ హౌస్ నందు నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తొలుత మొన్న రాత్రి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వద్ద పోలీసులు హజరుపర్చగా నిందితుల అరెస్టుకు ముందు సీఆర్పీసీ 41 నోటీసులు ఇవ్వలేదన్న కారణంగా రిమాండ్ రిపోర్టును తిరస్కరించారు. దీంతో పోలీసులు వారికి 41 ఏ నోటీసులు ఇచ్చి పంపించారు. తదుపరి ఈ రోజు సైబరాబాద్ పోలీసులు ఏసీబీ కోర్టు రిమాండ్ రిపోర్టు తిరస్కరించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఏసీబీ కోర్టు తీర్పును సస్పెండ్ చేసి రిమాండ్ కు తరలించడానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ రోజు మరో సారి అరెస్టు చేసి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సమక్షంలో హజరుపర్చారు.
మరో పక్క ఇదే కేసును సీట్ లేదా సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ పోలీసు విచారణను నవంబర్ 4వ తేదీ వరకూ నిలుపుదల చేస్తూ స్టే విధించింది.