హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా చూసేందుకు విద్యార్ధులు వెళ్లారు. విద్యార్ధులు అందరూ భారతీయ విద్యాభవన్ కు చెందిన వారు. విద్యార్ధులు ఎస్కలేటర్ ఎక్కుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఎస్కలేటర్ వేగంగా వెళుతుండటంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఈ ఘటనలో 15 మంది విద్యార్ధులు గాయపడగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ ఘటనతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు గురైయ్యారు.
ధియేటర్ లో జరిగిన ఘటనపై ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేష్ కుమార్ ఆదేశాలతో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన విద్యార్ధులను జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా, కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ థియేటర్ లో జరిగిన ఘటనలో పిల్లలకు చిన్న చిన్న గాయలు తప్ప ఎలాంటి ప్రమాదం లేదనీ, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు గాయపడిన పిల్లలకు అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయిస్తూ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.