సినీనటి జయసుధతో తెలంగాణ బీజేపీ మంతనాలు జరుపుతోంది. ఆమెను పార్టీలో చేర్చుకునే విధంగా పార్టీ ప్లాన్ చేస్తోంది. 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత జయసుధ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ప్రచారం చేసిన జయసుధ ఆ తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేరు. వచ్చే ఎన్నికల్లో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులను రంగంలోకి దించాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తొంది.
ఈ క్రమంలోనే జయసుధతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంప్రదించినట్లు తెలిసింది. ఈ నెల 21న అమిత్ షా చౌటుప్పల్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఈ సభలో ఎక్కువ మంది చేరికలు ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తొంది. ఇదే సభలో జయసుధను పార్టీలో చేర్చుకునేందుకు గానూ ఈటల రాజేందర్ ఆమెను సంప్రదించినట్లు తెలిసింది. అయితే జయసుధ బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ఆమె కొన్ని ప్రతిపాదనలు బీజేపీ ముందు ఉంచినట్లు సమాచారం. ఆ ప్రతిపాదనలను అంగీకరిస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధమని చెప్పారు.
ఈ నెల 21వ తేదీన అయితే ఆమె చేరడం లేదు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దలతో తన ప్రతిపాదనలపై మాట్లాడి హామీ ఇస్తే పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఒకే చెప్పారు జయసుధ. అయితే జయసుధ ఏమేమి ప్రతిపాదనలు చేశారు అనేది బయటకు తెలియరాలేదు. కాగా కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుండి రాజీనామా చేసిన మంత్రి యర్రబెల్లి దయాకరరావు సోదరుడు ప్రదీప్ రావు, కన్నెబోయిన రాజయ్య యాదవ్ తదతరులు వారి అనుచరులతో 21న అమిత్ షా సమక్షంలో పార్టీ చేరనున్నారు.