Advocate murder case : తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో కొత్త వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా తాజాగా ఓ రిటైర్డ్ ఇంజనీర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఇంజనీర్ వెల్ది వసంతరావు (62) ను పోలీసులు నిన్న అరెస్టు చేశారు. గ్రామంలో నిర్మిస్తున్న పెద్దమ్మగుడిని అడ్డుకునేందుకు గతంలో వసంతరావుకు వామనరావు నోటీసులు ఇప్పించారని సమాచారం. అదే విధంగా వసంతరావు, ఆయన కుమారుడు అవినీతి బాగోతం గురించి బయటపెడతానని, ఏసిబీకి ఫిర్యాదు చేస్తానని వామనరావు బెదిరించారని చెబుతున్నారు. ఈ విషయాలపై తరచు భాదపడే వసంతరావు.. కుంట శ్రీను వద్ద తన భాధను వ్యక్తం చేస్తూ వామనరావును హత్య చేయాలని కోరినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో వామనరావు దంపతుల హత్య కేసులో వసంతరావుకు భాగస్వామ్యం ఉందని దృవీకరణకు వచ్చిన పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన వామనరావు దంపతుల కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ లు వస్తున్నాయి. అయితే స్వయంగా ఈ కేసును హైకోర్టు పర్యవేక్షిస్తున్నందున ఆ అ అవసరం లేదని తెలిపింది. హైకోర్టు న్యాయవాద దంపతులు దారుణ హత్యకు గురి కావడంతో హైదరాబాద్ లోని అన్ని కోర్టుల న్యాయవాదులు విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అసలైన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ ప్రధాన అనుచరుడు కావడంతో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఆయన ఖండించిన సంగతి తెలిసిందే.