Advocates Murder Case: తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధును పోలీసులు ఇంటికి పంపారు. మృతుడు వామన్ రావు తండ్రి కిషన్ రావు ఫిర్యాదు మేరకు మూడు రోజుల క్రితం మధును ఏపిలోని భీమవరం వద్ద తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిన్న రామగుండం కమిషనరేట్ లో పుట్ట మధు, ఆయన సతీమణి శైలజతో పాటు మధుకు సన్నిహితుడైన కమాన్పూర్ ఎఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణను రోజంతా విచారణ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. అర్థరాత్రి తర్వాత మధును పోలీసులు ఇంటికి పంపారు. తిరిగి విచారణ నిమిత్తం ఎప్పుడు పిలిచినా కమిషనరేట్ కు హజరుకావాలని పోలీసులు తెలిపారు.
వామన్ రావు హత్య జరిగిన ఫిబ్రవరి 17వ తేదీన, అంతకు ముందు హంతకులతో ఫోన్లలో ఎవరెవరితో ఎంత సేపు మాట్లాడారో ఆ కాల్ డేటా ఆధారంగానే పోలీసులు కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రూ.2కోట్ల వ్యవహారంలో స్పష్టత కోసం పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. 12 బ్యాంకుల నుండి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. అయితే రెండు రోజుల పోలీసుల విచారణలో పుట్ట మధు నోరు మెదపలేదనీ, హత్యలతో తన ప్రమేయం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడైన కుంట శ్రీనును కస్టడీలోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నట్లు సమాచారం.