నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలో స్థానికులు అడ్డుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఎద్దండిలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీ కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో అరవింద్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. గోదావరి ముంపు బాధితులకు గతంలో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందనీ కానీ ఆ భూములను స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమ బంధువులకు ఇప్పించాలని అర్వింద్ ఆరోపించారు.
ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. మరో పక్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనిపై వెంటనే స్పందించారు. ఆయన నేరుగా స్పందించి ధర్మపురి అరవింద్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధర్మపురి అరవింద్ పై కారుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి జరిగిన తీరు, అనంతర పరిణామాలపై అమిత్ షా ఆరా తీశారు.
ఈ సందర్భంలో తనపై జరిగిన దాడి ఘటనను అమిత్ షాకు అరవింద్ పూర్తి స్థాయిలో వివరించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ నేతలు దాడులకు దిగుతున్నారని ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ నియోజకవర్గంలో తాను ఎక్కడ తిరిగినా తనపై దాడులు చేయాలని టీఆర్ఎస్ అధినాయకత్వం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసిందని అరవింద్ తెలిపారు. తనపై దాడి జరిగిన అంశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ హస్తం ఉందని ఆయన అమిత్ షా కు ఫిర్యాదు చేశారు.