టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మకి సంబంధించి మరో నేరం వెలుగు చూసింది. దీంతో ఆయనపై ఈ రోజు మరో కేసు నమోదు అయ్యింది. రామచంద్రభారతిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. రామచంద్రభారతి రెండు పాస్ పోర్టులు కల్గి ఉన్నారంటూ సిట్ సభ్యుడు, రాజేంద్రనగర్ ఏసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.
రామచంద్ర భారతి ల్యాప్ ట్యాప్ ను పరిశీలించిన క్రమంలో ఆయనకు రెండు పాస్ పోర్టులు వేరువేరు నెంబర్లతో ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇంతకు ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు అనుసరించి అధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్సులు సైతం ఒక్కొటి మూడు చొప్పున కల్గి ఉన్నారన్న అభియోగంపై ఆయనపై ఒక కేసు నమోదైంది. తాజా కేసుతో రామచంద్రభారతిపై మొత్తం మూడు కేసులు ఉన్నట్లు అయ్యింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే అరెస్టు అయి రిమాండ్ లో ఉన్నందున మిగిలిన రెండు కేసుల్లో పీటీ వారెంట్ తో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.
మరో పక్క సిట్ అధికారులు దర్యాప్తు పేరుతో వేధిస్తున్నారంటూ న్యాయవాది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే రెండు రోజులు విచారణకు పిలిచిన సిట్ అధికారులు మరల ఎప్పుడు పిలిచినా రావాలని చెప్పారని, దీని వల్ల ఇతర పనులు ఏమి చేసుకోలేకపోతున్నట్లు శ్రీనివాస్ తరపు న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ కోర్టుకు తెలిపారు. దర్యాప్తునకు సంబంధం లేని విషయాలను అడుగుతున్నారనీ, ఆదాయపన్ను చెల్లింపునకు సంబంధించి వివరాలు కూడా తీసుకురావాలని అడుగుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ గంటల తరబడి ప్రశ్నిస్తుండటంతో శ్రీనివాస్ ఒత్తిడికి గురవుతున్నారని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. శ్రీనివాస్ తరపు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం .. ఈ నెల 25న సిట్ అధికారుల ముందు హజరై ఇది వరకే అడిగిన సమాచారాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ అరెస్టుపై హైకోర్టు ఏమన్నదంటే..?
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?