సూపర్ స్టార్ కృష్ణ కు నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, భారీ గా అభిమానులు పద్మాలయ స్టూడియాకు తరలివస్తున్నారు. అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్ధివదేహాన్ని ఈ ఉదయం నానక్రాం గుడలోని ఆయన నివాసం నుండి పద్మాలయ స్టూడియోకు తరలించారు. పలువురు ప్రముఖులు పద్మాలయ స్టూడియోకు వచ్చి కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
కృష్ణ భౌతికకాయానికి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నివాళులర్పించారు. అనంతరం మహేశ్ బాబు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, కోట శ్రీనివాసరావు సహా పలువురు ప్రముఖులు కృష్ణ పార్ధివదేహంపై పూలు చల్లి నివాళులర్పించారు. అబిమానుల సందర్శనార్థం కృష్ణ పార్ధివ దేహాన్ని పద్మాలయ స్టూడియోలో మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఉంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ మహప్రస్థానంలో అంత్రక్రియలు జరగనున్నాయి.
కృష్ణ మృతికి సంతాపంగా తెలుగు చిత్ర పరిశ్రమ షూటింగ్ లు బంద్ కి పిలుపునిచ్చింది. పలు చోట్ల సినిమా హాళ్లను మూసివేశారు. మరో వైపు కృష్ణ పార్ధివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసిఆర్ అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ కు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు.