AP Telangana Water War: ఏపి ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నేడు పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు నేతలతో కలిసి వెళ్లగా తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఏపి, తెలంగాణ మధ్య జల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుల వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించిన సంగతి తెలిసిందే. ఏపి ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో జల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జగ్గయ్యపేట నుండి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను నేతలు, కార్యకర్తలతో కలిసి పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళుతుండగా ముత్యాల గ్రామ శివారులో తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఏపి భూ భాగం నుండి ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లేందుకు ఉదయభాను యత్నించారు. తెలంగాణ పోలీసులతో ఉదయభాను చర్చించినా ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులు అడ్డుకున్న ప్రదేశంలోనే నిరసన తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ కృష్ణా డెల్టా రైతుల అవసరాల కోసమే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణమైందని గుర్తు చేశారు. రైతాంగ ప్రయోజనాలకు భంగం కల్గిస్తూ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రులు మాట్లాడే తీరును ఉదయభాను తప్పుబట్టారు. ఏపి రైతుల హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తుందని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు.