Covid 19 Cases: చైనా, అమెరికా సహా విధ దేశాల్లో కోవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ జంట నగరాలతో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో చాలా మంది ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ప్రస్తుతానికి అవసరం అయినప్పటికీ, తెలంగాణలో కేసుల సంఖ్య పెరగడం లేదని అధికారులు చెబుతున్నందున భయపడాల్సిన అవసరం లేదు.
హైదరాబాద్లో కోవిడ్ కేసులు
ప్రస్తుతం రాష్ట్రంలో రోజు వారీ కోవిడ్ కేసుల నమోదు సంఖ్య అత్యల్పంగా ఉంది. నిన్న (మంగళవారం డిసెంబర్ 20)న తెలంగాణ రాష్ట్రంలో అయిదు కేసులు నమోదయ్యాయి. వీరిలో నాలుగు కేసులు హైదరాబాద్ నుండే నమోదు అయినట్లు సమాచారం. గడిచిన ఏడు రోజుల్లో హైదరాబాద్లో 24 కోవిడ్ కేసులు నమోదు అవ్వగా, అందులో మూడు నిజామాబాద్లో, రెండు రంగారెడ్డిలో, మహబూబ్నగర్, ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి, హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. నిన్నటి వరకూ తెలంగాణలో 34 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది. రాష్ట్రంలో మంగళవారం 4654 మంది పరీక్షలు చేయించుకున్నారు.
రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు
కోవిడ్ కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలనీ, పాజిటివ్ కేసుల నమోదును జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని సూచించింది. ఇన్సాకాగ్ నెట్ వర్క్ ద్వారా కొత్త కేసులను ట్రాక్ చేయాలని సూచిస్తూ రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లేఖ రాసింది.
జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్, చైనా లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాకేశ్ భూషణ్ పేర్కొన్నారు. కొత్త వేరియంట్ లను ఇన్సకాగ్ నెట్ వర్క్ ద్వారా ట్రాక్ చేసేందుకు పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అలా చేయడం వల్ల సరైన సమయంలో కొత్త వేరియంట్ లను గుర్తించగలగుతామనీ, దానికి తగినట్లుగా వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాగలుగుతామని రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు.