తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఏవీఎస్ రెడ్డి విజయం సాధించారు. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్ధి ఏవీఎన్ రెడ్డి 1,169 ఓట్ల తో గెలుపొందారు. బీజేపీ అభ్యర్ధి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. సరూర్ నగర్ మినీ స్టేడియంలో జరిగిన ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకూ సాగింది.

బీజేపీ బలపర్చిన అభ్యర్ధి ఏవీఎన్ రెడ్డి తన సమీప పీఆర్టీయూటీఎస్ అభ్యర్ధి గుర్రం చెన్నకేశవరెడ్డి పై 1,150 ఓట్ల తేడాతో గెలిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో అభ్యర్ధుల్లో ఎవరికీ గెలుపునకు అవసరమైన ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ పద్ధతిలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. మూడో స్తానంలో ఉన్న టీఎన్యూటీఎఫ్ అభ్యర్ధి పాపన్న గారి మాణిక్ రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్ధులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్ రెడ్డి విజయం ఖరారైంది.

మొత్తం 29,720 ఓట్లకు గానూ 25,868 ఓట్లు పోల్ అవ్వగా, అందులో 452 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మిగిలిన 25,416 ఓట్లలో గెలుపునకు కావాల్సిన 12,709 ఓట్లు ఏ ఒక్క అభ్యర్ధికి రాకపోవడంతో ఎనిమినేషన్ పద్దతిలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్ధిగా ఏవీఎన్ రెడ్డి, పీఆర్టీయుటీఎన్ అభ్యర్ధి గుర్తం చెన్నకేశవరెడ్డి, యూటీఎఫ్టీఎన్ అభ్యర్ధి మాణిక్ రెడ్డి, కాంగ్రెస్ బలపర్చిన హర్షవర్థన్ రెడ్డి పోటీ చేసారు.