Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ వర్సెస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య ఆన్లైన్లో ట్విట్టర్ వేదికగా జరుగుతున్న మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి పంపించాలని, ఇందుకోసం బీజేపీ తరఫున ‘దరఖాస్తుల ఉద్యమాన్ని’ ప్రారంభిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు.
Read More : Bandi Sanjay: బండి సంజయ్ వర్సెస్ టీర్ఎస్ ఎమ్మెల్యే… రచ్చ రచ్చ.
బండి సంజయ్ ఏమన్నారంటే…
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి పంపేందుకు బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ చేపట్టిన ‘దరఖాస్తుల ఉద్యమాన్ని’ ప్రారంభించడం జరిగింది అని బండి సంజయ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ హామీలను అమలయ్యేలా ఒత్తిడి తీసుకొచ్చి,తెలంగాణ ప్రజలకు మేలు చేకూర్చడమే ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ దరఖాస్తుల ఉద్యమాన్ని చేపడుతున్నామే తప్ప రాజకీయ లబ్ధి కోసం కాదని తెలిపారు.
Read More: KCR: దళితబంధు కేసీఆర్ కు బెడిసికొడుతోందా?
కేటీఆర్ సెటైర్
బీజేపీ దరఖాస్తుల ఉద్యమం ట్వీట్పై కేటీఆర్ ఆసక్తికరంగా స్పందించారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే విదేశాల్లోని బ్లాక్ మనీ రప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామంటూ అప్పట్లో ప్రధాని మోడీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ దరఖాస్తుల ఉద్యమంపై కేటీఆర్ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు ‘‘ప్రధాని నరేంద్ర మోడీ హామీ మేరకు ప్రతి పౌరుడికి రూ.15లక్షల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ బీజేపీ తీసుకున్న చర్యను స్వాగతిస్తున్నాను. అర్హులైన రాష్ట్ర ప్రజలంతా తమ జన్ధన్ ఖాతాల్లో ధనాధన్ డబ్బులు పడేందుకు భాజపా నేతలకు దరఖాస్తులు పంపాలి’’ అని ట్వీట్ చేశారు.