Bandi sanjay Vs KCR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్ఎస్ అధినేత సీఎం కేసిఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల కాలం వరకూ బీజేపీ నేతల విమర్శల పట్ల అంతగా స్పందించని కేసిఆర్..నిన్న ప్రగతి భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎనుగు వెళతుంటే కుక్కలు మొరుగుతుంటాయన్న సామెతగా ఇప్పటి వరకూ తాను పట్టించుకోలేదని పేర్కొన్న కేసిఆర్ …రైతులకు మోసపు మాటలు చెప్పి ఇబ్బందులు పెడుతున్నందున స్పందిస్తున్నానన్నారు. కేసిఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ నేడు మీడియా సమావేశంలో కౌంటర్ విమర్శలు చేశారు. ఈ మీడియా సమావేశంలో బండి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసిఆర్ ఆ కొద్దిసేపటికే స్పందించారు. కేసిఆర్ చెప్పేవి అన్నీ అబద్దేలే అని బండి సంజయ్ అంటే సంజయ్ సొల్లు పురాణం చెప్పారంటూ కేసిఆర్ యద్దేవా చేశారు.
Bandi sanjay Vs KCR: 62 లక్షల ఎకరాల్లో వరి సాగా ? ఎక్కడ ?
బండి సంజయ్ ఏమన్నారంటే…కేసిఆర్ నోరు తెరిస్తే అబద్దాలే. అబద్దాల కోసమే ప్లీనరీలు, బహిరంగ సభలు, కేబినెట్ భేటీలు పెడుతున్నారు అని ఎద్దేవా చేశారు. కేసిఆర్ నిన్న గంట పాటు అబద్దాలు చెప్పారు. 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. నిపుణులతో కలసి హెలికాఫ్టర్లో పరిశీలిద్దామా? అని ప్రశ్నించారు. రాష్ట్రంపై కేంద్రం పెత్తనం ఏంటని నిలదీసే కేసిఆర్ ..మళ్లీ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనడం లేదని అంటారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. వరి కొంటామని ఆగస్టు 31న కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందనీ, కానీ లేఖ రాయలేదని కేసిఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని బండి అన్నారు. ఒక సారి వరి వేయాలని, మరో సారి వేయవద్దని చెబుతూ రైతులను తికమక పెడుతున్నారని సంజయ్ దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచలేదని కేసిఆర్ చెప్పడం పచ్చి అబద్దమని వ్యాఖ్యానించారు. తన మెడ నరుకుతాననీ కేసిఆర్ అన్నారనీ, ఎప్పుడు నరుకుతారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మందు తాగి బండి నడిపితే తప్పన్నప్పుడు.. మందు తాగి ప్రభుత్వాన్ని నడపడం కూడా తప్పేనని సైటెర్ వేశారు.
Read More: Sonu Sood: సోనూ సూద్కు బీజేపీ భయపడుతుందా..!? మంత్రి కేటిఆర్ ఏమన్నారంటే..?
హెలికాఫ్టర్ లో తిప్పి చూపిస్తా.. వస్తావా ..?
బండి సంజయ్ వ్యాఖ్యలపై కేసిఆర్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకండా బండి సంజయ్ సొల్లు పురాణం చెప్పారన్నారు కేసిఆర్. వడ్లు కేంద్రం కొంటుందా, కొనదా సూటిగా సమాధానం చెప్పాలని కేసిఆర్ డిమాండ్ చేశారు. గట్టిగా ప్రశ్నిస్తే దేశ ద్రోహులని ముద్రవేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో పంటను ఆరు హెలికాఫ్టర్ లు పెట్టి చూపిస్తా, వస్తావా బండి సంజయ్, రా చూపిస్తా అంటూ కేసిఆర్ సవాల్ విసిరారు. బీజేపీ రెండు స్టాంపులను తయారు చేసి పెట్టుకుందనీ, ఒకటి దేశ ద్రోహి, రెండు అర్బన్ నక్సలైట్ అని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే దేశ ద్రోహులంటున్నారని పేర్కొన్నారు. గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్ స్టాంప్ వేస్తున్నారని దుయ్యబట్టారు. మేఘాలయ గవర్నర్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడారు ఇప్పుడు ఆయన కూడా దేశద్రోహేనా అని ప్రశ్నించారు. రాయలసీమకు వెళ్లి నీరు కావాలని చెప్పిన మాట వాస్తవమేననీ, ఈ రోజు కూడా అదే మాట చెబుతున్నాననీ, ఏపి సీఎంను హైదరాబాద్ కు పిలిపించుకొని మరీ రాయలసీమ కు నీళ్లివ్వాలని చెప్పానన్నారు. బేసిన్లు, భేషజాలు ఉండొద్దని ఏపి సీఎంకి చెప్పానన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రాల్లో ఎన్నికలను బట్టి రాజకీయాలు చేస్తుంటాయన్నారు. బీజేపీ నేతల కథ తెల్చే వరకూ తాను రోజు మీడియా సమావేశం పెట్టి మాట్లాడతానని కేసిఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ పథకాలను కేంద్రమే మెచ్చుకుంది
తెలంగాణ పథకాలను పార్లమెంట్ లో మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ ప్రగతిని ఆర్బీఐ కూడా మెచ్చుకుందన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతిని బీజేపీ పాలిత రాష్ట్రాలు సాధించిందా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో ఎన్నో సార్లు రాజీనామాలు విసిరికొట్టామన్నారు. కొన్ని కారణాల వల్ల ఎస్సీని సీఎం చేయలేకపోయామనీ అయినా ప్రజలు స్వాగతించారని కేసిఆర్ అన్నారు. కేంద్రం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిందని విమర్శించారు. తాము లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చామనీ, 70వేల ఉద్యోగాలు ఇవ్వనున్నామని కేసిఆర్ చెప్పారు.