Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళనను కొనసాగిస్తున్నారు. బుధవారం రాత్రి జోరున వర్షం కురిసినా విద్యార్ధులు ఆందోళన విరమించలేదు. గొడుగులు వెసుకుని మరీ క్యాంపస్ మెయిన్ గేటు వద్ద భైటాయించి తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. క్యాంపస్ లోని సమస్యలపై ప్రతి ఏటా విద్యార్ధులు నిరసన వ్యక్తం చేస్తుండటం దానిపై అధికారులు సముదాయించడం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం నుండి విద్యార్ధులు ఆందోళనకు దిగారు. బాసర ట్రిపుల్ ఐటీకి రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్ నియమించాలని, క్యాంపస్ లో సమస్యలను పరిష్కరించాలని ఇలా మొత్తం 12 డిమాండ్లతో విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ విద్యార్ధులతో చర్చించారు. తమ పరిధిలోని అంశాలను పరిష్కరిస్తామనీ, మిగిలినవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చినప్పటికీ విద్యార్ధులు తమ ఆందోళనను కొనసాగించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రాత్రి వర్షం పడుతున్నా గొడుగులు వేసుకుని మరీ తమ ఆందోళనను కొనసాగించారు. దీనిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ విద్యార్ధులు డిమాండ్ లలో కొన్ని ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు. బెంచీలు, పంబ్లింగ్, యూనిఫామ్ వంటి వాటి కోసం విద్యార్ధులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదనీ వాటిని సమకూర్చడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. కోవిడ్ మూలంగా విద్యా వ్యవస్థకు ఆటంకం ఏర్పడిందనీ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణ అంశం పిల్లలు డిమాండ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాలు ఎక్కడ చేయాలో అక్కడ చెద్దామనీ, పిల్లలను ప్రశాంతంగా ఉండనీయాలని అన్నారు.
సమస్యలు ఏమైనా ఉంటే ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకురావాలి కానీ ఇలా ఆందోళనలకు దిగవద్దని సూచించారు. విద్యార్ధులు తమ కేరీర్ పై దృష్టి పెట్టి రేపటి నుండి తరగతులకు హజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఎవరో ఏదో చెప్పారని బాసర ట్రిపుల్ ఐటీ ప్రతిష్ఠను చెడగొట్టవద్దని మంత్రి సబితా కోరారు. విద్యార్ధుల డిమాండ్ల పై మంత్రి అధికారులతో సమీక్షించారు. విద్యార్ధులతో చర్చించి చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ఆదేశించారు. మరో పక్క విద్యార్ధుల ఆందోళనపై ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్రిపుల్ ఐటీలో సమస్యలను సీఎం కేసిఆర్, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు మంత్రి కేటిఆర్.