Big breaking : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరు అనే విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య కుమారుడు భగత్ కుమార్ కి పార్టీ అభ్యర్థిత్వం ఖరారు చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య అకాల మృతితో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ భవన్ లో నోముల భగత్ కు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ పార్టీ భీ పాం అందజేశారు. భి ఫాంతో పాటు ఎన్నికల ప్రచార ఖర్చు నిమిత్తం రూ.28 లక్షల చెక్కును కూడా కేసిఆర్ అందించారు. భగత్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పలువురు టీఆర్ఎస్ నేతలు ఈ టికెట్ ఆశించినప్పటికీ కేసిఆర్ నియోజకవర్గంలో సర్వే, ఇతర పరిశీలనల అధారంగా భగత్ ను అభ్యర్థిగా ఎంపిక చేశారు.
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్శింహయ్య, నాటి కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డిపై 7,700 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఖరారు అయిన నోముల భగత్ కుమార్ తెలంగాణ హైకోర్టు న్యాయవాదిగా పని చేస్తున్నారు. బీఇ, ఎంబిఎ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఏం పూర్తి చేసిన భగత్ కుమార్ సత్యం టెక్నాలజీస్ లో జూనియర్ ఇంజనీర్ గా, విస్టా ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్ లో మేనేజర్ గా గతంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి జానారెడ్డిని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించగా ఆయన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజెపీ అభ్యర్థిగా కంకణాల నివేదిత రెడ్డి కి పార్టీ అధిష్టానం అభ్యర్థిత్వం ఖరారు చేయకముందే ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ అభ్యర్థి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గత అసెంబ్లీ ఎన్ని కలలోనూ బీజెపీ అభ్యర్థిగా పోటీ చేసిన నివేదిత రెడ్డికి కేవలం 2600 కోట్లు వచ్చాయి.
సాగర్ ఉప ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 17వ తేదీన జరగనున్నది.