Big Breaking: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల ట్యాంక్ బండ్ పై నేడు నిరాహర దీక్ష చేసిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయాలని షర్మిల భావించినా పోలీసులు ఒక్క రోజుకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో ఉదయం నుండి సాయంత్రం వరకూ నిరాహార దీక్ష చేసిన షర్మిల సాయంత్రం దీక్ష విరమించి ట్యాంకు బండ్ నుండి లోటస్ పాండ్ కు పాదయాత్రగా బయలుదేరారు. అయితే పాదయాత్రకు పోలీసు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు షర్మిలకు తెలియజేశారు.
అయితే తాము శాంతియుతంగా పాదయాత్రగా లోటస్ పాండ్ కు వెళతామంటూ పట్టుబట్టారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అబిమానులతో ఆమె పాదయాత్రగా వెళుతుండగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద పోలీసులు నిలువరించారు. కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్దివాదం జరిగింది. ఈ సమయంలో షర్మిల స్పృహ తప్పిపడిపోయారు. ఈ క్రమంలోనే షర్మిలను పోలీస్ వాహనం ఎక్కించి బేగంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరాహార దీక్షలో వైఎస్ షర్మిలతో పాటు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ పాల్గొని సంఘీభావం తెలియజేశారు.