BJP : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటు తెలంగాణలో అటు ఏపీలో బలపడాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ విషయంలో కీలక అప్డేట్. జనసేన-భారతీయ జనతా పార్టీ మధ్య ఏపీలో పొత్తు ఉన్నా.. తెలంగాణలో భిన్నమైన పరిస్థితి. తాజాగా ఇందులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇదే ఒరవడిలో మరో కీలక పరిణామం బీజేపీలో అంతర్గతంగా జరిగింది.
BJP : బీజేపీలో కలకలం…
హైదరాబాద్ లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని పలువురు బీజేపీ నేతలు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ ను బీజేపీ నేతలు కలవడం పై బీజేపీ అధినాయకత్వం సీరియస్ అయినట్లు తెలుస్తుంది. వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు నిజ నిర్దారణ కమిటీని వేసింది. ముగ్గురు సభ్యులతో బీజేపీ వేసిన ఈ కమిటీ లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఉన్నారు. రెండు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని బీజేపీ ఆదేశించింది. రిపోర్ట్ తర్వాత ఒకరిద్దరు నేతల పై చర్యలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ బీజేపీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
బీజేపీ – జనసేన ట్విస్టులు…
తెలంగాణలో బీజేపీ – జనసేన పొత్తుల మధ్య అనేక ట్విస్టులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసిన జనసేన ఎమ్మెల్యే ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తటస్థంగా ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ ఖమ్మం వేదికగా ఆ రెండు పార్టీల మధ్య పొత్తు చిగురించింది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో 12 డివిజన్లలో బీజేపీ, 10 డివిజన్లలో జనసేన అభ్యర్థులను బరిలోకి దించనున్నారు. అయితే, ఎక్కడెక్కడి నుంచి ఏ పార్టీ అభ్యర్థి బరిలోకి దిగాలి అనే విషయంపై ఇరు పార్టీలు త్వరలోనే నిర్ణయం తీసుకుంటాయని చెబుతున్నారు.