మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపాయి. ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తున్నారు. బీజేపీతో పాటు అధికార టీఆర్ఎస్ కూడా ఆపరేషన్ ఆకర్షకు పదును పెట్టింది. మునుగోడు నియోజకవర్గంలో అభ్యర్ధుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో బీసీ సామాజికవర్గ ఓటర్లు ఉండగా ప్రధాన రాజకీయ పక్షాలు ఆ సామాజికవర్గ నేతలపై ఫోకస్ పెంచాయి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నుండి మాజీ ఎంపీ బూర నర్సయ్య ను బీజేపీలో చేర్చుకుని టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వగా, టీఆర్ఎస్ వెంటనే అప్రమత్తమైంది.
కాంగ్రెస్ పార్టీ నుండి అదే సామాజికవర్గానికి చెందిన పల్లె రవికుమార్, ఆయన భార్య చండూరు ఎంపీపీ కళ్యాణిని చేర్చుకోవడంతో పాటు బీజేపీ నేతలు దాసోజు శ్రావణ్, స్వామి గౌడ్ లను టీఆర్ఎస్ లో చేర్చుకుని బీజేపీకి షాక్ ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుండగా, ఇప్పుడు మనుగోడు స్థానాన్ని తిరిగి కైవశం చేసుకోవడంతో పాటు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి హాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ ఉంది. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల వేళ రెండు పార్టీలు వలసలను ప్రోత్సహిస్తుండటంతో ఎవరెవరు పార్టీలు మారుతారనేది అర్దం కాని పరిస్థితి నెలకొంది.
ఇద్దరు మంత్రులతో పాటు నలుగురు ఎంపీలు, ఇద్దరు మాజీ మంత్రులు తమతో టచ్ లో ఉన్నారనీ, త్వరలో కాషాయ కండువా కప్పుకుంటారంటూ బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇటీవల చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇదే తరహాలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందరావు సైతం చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారనీ, ఉప ఎన్నిక తర్వాత తమ పార్టీలో చేరతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే టీఆర్ఎస్ మాత్రం ఇలాంటి ప్రకటనలు ఏమీ చేయకుండా బీజేపీ నేతలను ఆకర్షిస్తొంది, పార్టీలో చేర్చుకుంటోంది. తాజాగా బీజేపీకి షాక్ ఇస్తూ మాజీ ఎంపీ రాపోలు ఆనంద బాస్కర్ ఆదివారం ప్రగతి భవన్ కు చేరుకుని సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందిస్తూ దుశ్సాలువా కప్పి సత్కరించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ఆనంద భాస్కర్ కొనియాడారు. భారత రాష్ట్ర సమితి (బీఅర్ఎస్) ద్వారా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. నేత కుటుంబం నుంచి వచ్చిన తాను బీజేపీ చేస్తున్న ఈ నిర్వాకాన్ని చూస్తూ భరించలేననీ, తాను బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతానని సీఎం కేసీఆర్ కు తెలియజేశారు. ఓ పక్క బీజేపీ ప్రకటనలతో ఊదర కొడుతుండగా టీఆర్ఎస్ సైలెంట్ గా వర్క్ అవుట్ చేస్తూ బీజేపీకి షాక్ ల మీద షాక్ లు ఇస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.