BJP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మంగళవారం అర్ధరాత్రి తర్వాత కరీంనగర్ లోని ఆయన ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు చేసిన బండి సంజయ్ ను యాదాద్రి – భువనగిరి జిల్లా బొమ్మలరామరం పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. విషయం తెలుసుకున్న పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు బొమ్మలరామరం పీఎస్ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు.

పీఎస్ లో ఉన్న బండి సంజయ్ ను పరామర్శించేందుకు బొమ్మలరామరం వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాసనసభ్యుడుగా, న్యాయవాదిగా బండి సంజయ్ ను కలిసే అవకాశాలు తనకు ఉన్నాయనీ, తనను ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ పోలీసులతో రఘునందనరావు వాదనకు దిగారు. శాంతి భద్రతల సమస్య అని చెబుతూ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
మరో పక్క బండి సంజయ్ అక్రమ అరెస్టు అంటూ బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. కనీసం నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారని ఆరోపించారు. తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బీజేపీ నేతలను హౌస్ అరెస్టు చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. కాగా బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ లీగల్ సెల్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. బొమ్మలరామారం పీఎస్ వద్ద బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. బండి సంజయ్ ను విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. బండి సంజయ్ ను నల్లగొండ లేదా వరంగల్లు జిల్లాలో కోర్టులో హజరుపర్చేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు.
Bandi Sanjay Arrest: అర్ధరాత్రి బండి సంజయ్ అరెస్టు .. సర్కార్ పై బీజేపీ నేతలు ఫైర్