తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పదవీ కాలం ఫిబ్రవరి నెలలో ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. బండి సంజయ్ ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుని, పార్టీ అధ్యక్ష పదవిని ఈటల రాజేందర్ లేదా మరో నాయకుడికి కట్టబెడతారు అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహిస్తూ బండి సంజయ్ తెలంగాణ పార్టీలో ఊపు తీసుకువచ్చారు. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను సిద్దం చేస్తూ ముందుకు సాగుతోంది. ఇందుకు కేంద్ర నాయకత్వం సంపూర్ణ సహకారాలు అందిస్తొంది.
బండి సంజయ్ నాయకత్వాన్ని వ్యతిరేకించే కొందరు సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ ను ముందు పెట్టి పార్టీ అధిష్టానం వద్ద చక్రం తిప్పాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే బండి సంజయ్ కార్యక్రమాల పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లు సంతృప్తిగా ఉన్నారనీ, ఇటీవల ఆయనను అభినందించారని కూడా బండి వర్గీయులు పేర్కొంటున్నారు. నాయకత్వ మార్పు ఉంటుందని భావిస్తున్న పార్టీ నేతలు పలువురు.. సీనియర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా అనుభవం ఉన్న ఈటల రాజేందర్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తే బాగుంటుంది అన్న అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఈ ఊహాగానాలకు తెరదించారు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పులు ఉండవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న టీమ్ తోనే ఎన్నికలకు వెళతామని చెప్పారు. తెలంగాణలో ని అన్ని నియోజకవర్గాల్లో బీజేపికి అభ్యర్ధులు లేరని వస్తున్న వార్తలపైనా ఆయన స్పందిస్తూ ఎన్నికలు వస్తే బీజేపీకి ప్రజలే అభ్యర్ధులను ఇస్తారని అన్నారు. బీజేపీ కి నాయకత్వ సమస్య లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.