ఖమ్మం పట్టణంలో రైతు గోస – బీజేపీ భరోసా బహిరంగ సభ ప్రారంభం అయ్యింది. ఈ సభకు ముఖ్య అతిధిగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభానికి ముందు గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ ను ప్రకటించాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆమెను అభినందిస్తూ అమిత్ షా సత్కరించారు. సహజంగా రాజకీయ నాయకులకు తమ ప్రసంగాల్లో పొరబాట్లు దొర్లుతుంటాయి. అయితే ఆ వెంటనే పొరబాటును సరి చేసుకుంటారు. సీనియర్ నాయకులు అయితే చాలా జాగ్రత్తగానే మాట్లాడతారు. కానీ సీనియర్ నాయకుడైన కిషన్ రెడ్డి తన ప్రసంగంలో తప్పులు దొర్లడం బీజేపీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది.

అనంతరం కిషన్ రెడ్డి తన ప్రసంగంలో రెండు పొరబాట్లు దొర్లాయి. అమిత్ షా ను కేంద్ర సహాయ మంత్రి అని సంభోదించి తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అని సరి చేసుకున్నారు. ఇక నాయకుల పేర్లు చదువుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు చెప్పబోయి మాజీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరగా, ఆయన సోదరుడైన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరును కిషన్ రెడ్డి ప్రస్తావించడంతో అందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు.
అనంతరం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరవు పెట్టారు కిషన్ రెడ్డి. కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక పోయినట్లు ధరణి పోర్టల్ తయారైందన్నారు. ధరిణి పోర్టల్ కారణంగా రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు రుణ మాఫీ మెజార్టీ రైతులకు జరగలేదన్నారు. కేసిఆర్ పాలనలో వ్యవసాయం దండుగగా మారిందని విమర్శించారు. కేసిఆర్ పాలనలో కల్తీ విత్తనాలు పెరిగాయన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
రైతులకు మేలు చేస్తున్నట్లు కేసిఆర్ సర్కార్ ఫోజు కొడుతుందే కానీ ఏ మాత్రం రైతులకు ప్రయోజనం జరగడం లేదని విమర్శించారు. పంటల భీమా పథకం అమలు చేయని కారణంగా రాష్ట్రంలో పకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోతున్నారన్నారు. కమీషన్ల ప్రాజెక్టులగా తెలంగాణ ప్రాజెక్టులు మారాయని విమర్శించారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లేననీ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్ కు ఓటు వేసినట్లే, ఈ రెండు పార్టీలకు ఓట్లు వేస్తే అది మజ్లీస్ పార్టీకి ఓటు వేసినట్లేనని అన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి.
Blast In Cracker Factory: బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు .. 8 మంది కార్మికులు దుర్మరణం