Breaking: మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ ప్రకటించింది. ఉప ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని రాజకీయ పక్షాలు ప్రచారాలను నిర్వహిస్తూ ఎదుచూస్తుండగా నేడు ఈసీ ఎన్నికల షెడ్యుల్ ను ప్రకటించింది. ఈ నెల 7వ తేదీన మునుగోడు ఉప ఎన్నికకు గానూ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ జరిగిన మూడు రోజులకు నవంబర్ 6వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజు ఫలితాన్ని ప్రకటించనున్నారు.
కోమటిరెడ్డి రాజీనామాతో…
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనాామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ తరపున ఆయన ఎన్నికల బరిలో దిగనుండగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతిని ఆ పార్టీ ప్రకటించింది. అధికార టీఆర్ఎస్ ఇంత వరకూ అభ్యర్ధిని అయితే ప్రకటించలేదు కానీ ఎన్నికల గుర్తుతో ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తొంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన కొద్ది రోజుల నుండి మూడు ప్రధాన రాజకీయ పార్టీలు మునుగోడుపై ఫోకస్ పెట్టాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ముందుగానే మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకుని ప్రచారం నిర్వహిస్తుండగా, బీజేపీ తరుపున అయినా విజయం సాధించి తన సత్తా చాటాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యూహాలను సిద్దం చేసుకున్నారు.
ఇక అధికార టీఆర్ఎస్ మంత్రులు, సీనియర్ నేతలను ప్రచారంలోకి దింపింది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ అభ్యర్ధి విజయానికి కారణమవుతాయని ఆ పార్టీ భావిస్తొంది. అంతే కాకుండా కాంగ్రెస్ ఓట్ల చీలిక ప్రభావం, ఉభయ కమ్యూనిస్టుల మద్దతు కలిసి వస్తుందన్న ఆశలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కాగా దేశ వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు గానూ ఇవేళ ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసింది. మహారాష్ట్ర, బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?