Breaking: సికింద్రాబాద్ బోయిగూడ ప్రాంతంలోని టింబర్ డిపో లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా టింబర్ డిపో నుండి చెలరేగిన మంటలు పక్కనే ఉన్న స్క్రాప్ గోదాంకు వ్యాపించాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అయిదు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. మంటల ధాటికి గోడౌన్ పై కప్పు కుప్పకూలింది. రెస్క్యూ సిబ్బంది మృతదేహాలను వెలికి తీశారు.
మృతులు అంతా బీహార్ కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఘటనా స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టర్ శర్మన్ పరిశీలించారు. ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి తలసాని తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సికిందర్ (40), గోలు (28), దామోదర్ (27), బిట్టు(23), సత్యేందర్ (35), పంకజ్ (26), దీపక్ (26), చింటు (27), రాజేశ్ (25), దినేష్ (35) గా గుర్తించారు. గోడౌన్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.