Breaking: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపణలు సృష్టిస్తున్న తరుణంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐ ద్వారా లేదా కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సీట్) తో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ తరుణంలో కేసిఆర్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వెలుగులోకి వచ్చింది. సీబీఐకి రాష్ట్రంలో నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. తెలంగాణ రాష్ట్రంలో సీబీఐకి గతంలో దర్యాప్తు కోసం ఇచ్చిన అనుమతిని టీఆర్ఎస్ సర్కార్ ఉపసంహరించుకుంది. రాష్ట్ర హోంశాఖ ఈ మేరకు జివో 51ను రెండు నెలల క్రితం (ఆగస్టు 30న) జారీ చేసినప్పటికీ ఆ ఉత్తర్వులను గోప్యంగా ఉంచింది. మోయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంపై బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సమయంలో సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర అనుమతి తప్పనిసరి తెలియజేయడంతో ఈ జీవో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
గతంలోనే పలు రాష్ట్రాలు ఇటువంటి కీలక నిర్ణయాలను తీసుకున్నాయి. చాలా కాలంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కార్ రాజకీయ ప్రత్యర్ధులపై ప్రయోగిస్తొందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ సర్కార్, ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్రలో శివసేన సర్కార్. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ సర్కార్ ఇలా పలు రాష్ట్రాలు సీబీఐకి అనుమతిని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వరుసలో కేసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేనిదే తెలంగాణలో కేసులను సీబీఐ దర్యాప్తు చేపట్టడానికి అవకాశం ఉండదు.