Breaking: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా అత్యంత వేగంగా విస్తరించే ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు సూచనలు జారీ చేస్తున్నా ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. దీంతో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేందుకు గానూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ లేకుండా ప్రజలు తిరిగితే వెయ్యి రూపాయలు జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
గత నెలలోనే ఈ మేరకు ప్రభుత్వం హెచ్చరించినా ప్రజలు పాటించడం లేదు. ఈ రోజు నుండి ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని పోలీసు శాఖకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు.