దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ లక్ష్యాలను ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రకటించారు. భారీ ఎత్తున నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ లో ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్ తో కలిసి పాల్గొన్న పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసిఆర్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ లక్ష్యాలను వివరించారు. ఖమ్మం బహిరంగ సభ దేశంలో ప్రబలమైన మార్పునకు సంకేతమని అన్నారు. దేశానికి పొరుగున ఉన్న చైనా ప్రపంచాన్ని ఏ విధంగా శాసిస్తుందో చూడాలనీ, జపాన్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవాలని అన్నారు కేసిఆర్. మన దేశం కూడా ఆ రకంగా ముందుకు తీసుకువెళ్లాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమని కేసిఆర్ పేర్కొన్నారు.

మోడీ ప్రభుత్వానికి కనీసం మంచినీళ్లు, కరెంటు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ భగీరధను దేశంలో అమలు చేస్తామని తెలిపారు. మేకిన్ ఇండియా నినాదం జోన్ ఇన్ ఇండియా అయిపోయిందని ఎద్దేవా చేశారు. అగ్నిపథ్ ను కూడా తాము అధికారంలోకి రాగానే రద్దు చేసి పాత విధానంలోనే రిక్రూట్ మెంట్ లు చేస్తామని తెలిపారు కేసిఆర్. సైనికులను పలుచగా చూడటం తగదని కేసిఆర్ అభిప్రాయపడ్డారు. విశాఖ ఉక్కును ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయివేటీకరణ చేయనివ్వబోమని కేసిఆర్ అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తుందని దుయ్యబట్టారు. అద్భుతమైన పంటలు పండే దేశాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ే ప్రభుత్వ రంగ సంస్థను ప్రయివేటు పరం చేసినా తము అధికారంలోకి రాగానే తిరిగి జాతీయూకరణ చేస్తామని తెలిపారు.ఎల్ఐసీ ఉద్యోగులు సింహాల్లా గర్జించాలని కేసిఆర్ పిలుపునిచ్చారు. చివరకు వ్యవసాయ రంగాన్ని కూడా ప్రవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు. మీ పాలసీ ప్రైవేటైజేషన్ అయితే మా పాలసీ నేషనైలేజేషన్ అని కేసిఆర్ అన్నారు. దళిత బంధు పథకాన్ని దేశం మొత్తం అమలు చేస్తామని కేసిఆర్ హామీ ఇచ్చారు.

మతం మత్తులో యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కేసిఆర్ ఆరోపించారు. అందరం ఏకమై ఈ మూర్ఖపు అసమర్ధ పాలనను తరిమికొట్టాలని కేసిఆర్ పిలుపునిచ్చారు. చట్టసభల్లో 35 శాతం మహిళలకు రిజర్వేషన్ లు అమలు చేస్తామని తెలిపారు.లక్షల కోట్ల ఆస్తి మన దేశ ప్రజల సొత్తు అని కేసిఆర్ అన్నారు. ఆహార ఉత్పత్తిలో ముందుండాల్సిన భారత దేశం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఖర్మ ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. నీరు పుష్కలంగా ఉన్నా ఎందుకు ఉపయోగించుకోవడం లేదని అన్నారు. 70వేల టీఎంసీల నీరు నికరంగా ఉంటే 19వేల టీఎంసీలు నీటిని మాత్రమే వాడుకుంటున్నామని తెలిపారు. భారత్ ఒక లక్ష్యం అనేది లేకుండా కొన్ని దశాబ్దాలుగా పయనిస్తున్నదని కేసిఆర్ అన్నారు.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విధానాలను దేశ ప్రజల ముందు పెడతామని కేసిఆర్ పేర్కొన్నారు. 150 మంది మేధావులు బీఆర్ఎస్ విధానాలను రూపొందిస్తున్నారని చెప్పారు. వామపక్షాల్లాంటి పార్టీలతో దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పని చేస్తుందన్నారు.తెలంగాణ మోడల్ దేశ మంతా అమలు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా ఉచిత విద్యుత్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో చైతన్యం తెచ్చేందుకే బీఆర్ఎస్ ఆవిర్భవించిందనీ, చివరకు విజయం మనదేనని కేసిఆర్ అన్నారు. 2024 తర్వాత మీరు (మోడీ) ఇంటికి మేము ఢిల్లీకి ఖాయమని పేర్కొన్నారు కేసిఆర్.
KCR: ఖమ్మం జిల్లాలో పంచాయతీ, మున్సిపాలిటీలకు పండుగే పండుగ .. రూ.కోట్లలో సీఎం కేసిఆర్ వరాలు