ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ పూర్తయ్యింది. ఇవేళ దాదాపు పది గంటలకుపైగా కవితను ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక విషయాలపై ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లై ను కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు సంధించి సమాధానాలు స్వీకరించారు.

పిళ్లే కస్టడీ ముగియడంతో విచారణ మధ్యలోనే రౌస్ ఎవెన్యూ కోర్టుకు ఆయనను తరలించారు. పిళ్లై మద్యలోనే వెళ్లిపోయినప్పటికీ కవితను రాత్రి వరకూ ఈడీ అధికారులు విచారించారు. విచారణ మధ్యలో ఈడీ కార్యాలయానికి కవిత న్యాయవాదుల బృందం సోమా భరత్, రామచంద్రరావు, మోహన్ రావు చేరుకోవడంతో పాటు ఆ వెంటనే మహిళా వైద్యురాలి నేతృత్వంలని బృందం రావడంతో ఈడీ కార్యాలయంలో ఏం జరగనుందా అనే ఉత్కంఠ నెలకొంది. మరో పక్క ఈడీ కార్యాలయం ముందు భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.

ఉదయం పది గంటలకు ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లిన కవిత రాత్రి 9.30 గంటలకు బయటకు వచ్చారు. ఆమె నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. తొలి సారి కవితను ఈడీ అధికారులు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు. రెండో సారి పది గంటలకుపైగా విచారణ జరిపారు. రెండో సారి విచారణకు హజరైన కవితను ఈడీ అధికారులు ఏ ప్రశ్నలు సంధించారు అనేది అసక్తికరంగా మారింది. ఇవేళ విచారణ సందర్బంలో ఆమె స్టేట్ మెంట్ లపై అధికారులు సంతకాలు తీసుకున్నట్లుగా తెలుస్తొంది. అయితే మరో సారి కవితను ఈడీ అధికారులు విచారణకు పిలిచినట్లుగా అనధికారికంగా సమాచారం అందుతోంది. రేపు మరో సారి విచారణ హజరుకావాలని అధికారులు కోరినట్లుగా చెబుతున్నారు. రేపు ఉదయం పదకొండు గంటలకు విచారణ రావాలని కవితను ఈడీ అధికారులు కోరినట్లుగా తెలుస్తొంది.
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు .. సీబీఐపై సుప్రీం కోర్టు సీరియస్