విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. రెండు బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ సమయంలో బస్సులో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. వివరాల్లోకి వెళితే .. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ వెన్నెల బస్సు హైదరాబాద్ నుండి విజయవాడ వెళుతున్న సమయంలో సాంకేతికలోపం తలెత్తింది. బ్యాటరీలో తలెత్తిన సమస్యతో బస్సు లైట్లు పని చేయలేదు. దీంతో డ్రైవర్ సూర్యపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల గ్రామ శివారులో నిలుపుదల చేసి ప్రయాణీకులను వేరే బస్సులో పంపించారు.
అనంతరం సూర్యాపేట నుండి ఏపిఎస్ఆర్ టీసీకి చెందిన మరో బస్సును రప్పించారు. వైర్ల సాయంతో రెండు బస్సుల మధ్య బ్యాటరీ సమస్య పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ లోపు సూర్యపేట నుండి వచ్చిన ఆర్టీసీ బస్సులో పెద్ద శబ్దం వచ్చి మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే రెండు బస్సులకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీగా ఎగిసి పడుతున్న మంటలతో విపరీతంగా పొగ అలుముకుంది. దీంతో ఈ రహాదారిపై భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం ఇవ్వడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదం వల్ల ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లినప్పటికీ ప్రయాణీకులు ఎవరికీ ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.