ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం అవుతోంది. ఈ కేసులో మరో హైదరాబాదీ కీలక వ్యక్తి అరెస్టు జరిగింది. హైదరాబాద్ కు చెందిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న ప్రముఖ వ్యాపార వేత్త రామచంద్ర పిళ్లై కి బుచ్చిబాబు గతంలో చార్టెడ్ అకౌంటెంట్ గా పని చేయడంతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గతంలో సహాయకుడుగా కూడా పని చేసి ఉండటం గమనార్హం. గతంలో బుచ్చిబాబు నివాసంలో సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. సీబీఐ అధికారులు అరెస్టు చేసిన బుచ్చిబాబును ఢిల్లీకి తరలించారు. ఈ రోజు ఢిల్లీ కోర్టులో బుచ్చిబాబును హజరుపరిచే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ కేసులో ఒక పక్క సీబీఐ, మరో పక్క ఈడీ దర్యాప్తు జరుపుతుండటం, కీలక వ్యక్తులను అరెస్టు చేస్తుండటంతో ఎప్పుడు ఎవరి వంతు వస్తుందో అన్న ఆందోళన వారిలో నెలకొంది. సమీర్ మహేంద్రు, విజయనాయర్ లను ఇంతకు ముందు సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం వీరికి బెయల్ మంజూరైనా ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన రెండవ చార్జి షీటులో కీలక విషయాలను ప్రస్తావించింది. సౌత్ సిండికేట్ లో పలువురు రాజకీయ నేతల పేర్లు వెల్లడించడం ప్రకంపనలు రేగుతున్నాయి. కాగా బుచ్చిబాబు రిమాండ్ రిపోర్టులో సీబీఐ అధికారులు ఎటువంటి కీలక విషయాలను ప్రస్తావిస్తారు అనేది ఆసక్తికరంగా మారాయి.