తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. బీజేపీ సీక్రెట్ ప్లాన్ ను భగ్నం చేశామనీ టీఆర్ఎస్ వెల్లడిస్తుండగా, ఇదంతా టీఆర్ఎస్ డ్రామా అని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఈ వ్యవహరంపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. మొయినాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్ లో పట్టుబడిన ముగ్గురు నిందితులను పోలీసులు రహస్య ప్రదేశాలకు తీసుకువెళ్లి విచారణ జరుపుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, సింహయాజీ, నంద కుమార్ లపై మొయినాబాద్ పీఎస్ లో 120 బీ, 171 బీ రెడ్ విత్, 171 ఇ, 506, ఐపీసీ 34, పీసీ యాక్ట్ సెక్షన్ 8 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది. బీజేపీలో చేరకపోతే దాడులు చేయిస్తామనీ, ఈడీ, సీబీఐ కేసులు పెట్టిస్తామనీ బెదిరించారని ఫిర్యాదులో రోహిత్ రెడ్డి చెప్పినట్లు సమాాచారం. బీజేపీలో చేరితే వంద కోట్లు ఇస్తామని మద్య వర్తి నందు ద్వారా ఆఫర్ చేసిన రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ ఫామ్ కు వచ్చినట్లు రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా ఈ బేరసారాల వెనుక ఎవరు ఉన్నారు అనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల ద్వారా వారు ఎవరెవరితో మాట్లాడారు అనే విషయాలను విశ్లేషిస్తున్నారు. నిందితులను పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఈ రోజు సాయంత్రానికి కోర్టులో హజరుపర్చనున్నారు. మరో పక్క పోలీసులు ఫామ్ హౌస్ ను తమ ఆధీనంలోకి తీసుకుని పరిశీలన చేస్తున్నారు. ఇతరులు ఎవ్వరినీ లోపలికి అనుమచించకుండా ఎమ్మెల్యేల ను ప్రలోభ పెట్టేందుకు ఫామ్ హౌస్ కు డబ్బులు తెచ్చరా.. తెస్తే ఎక్కడ దాచారు అనే కోణంలో తనిఖీలు చేస్తున్నారు. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసు పూర్వాపరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్థన్ రెడ్డి లు ఘటన తర్వాత రాత్రి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. మరో పక్క బీజేపీ కుట్రను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.