క్యాసినో నిర్వహకుడు చీకోటి ప్రవీణ్ సంచలన కామెంట్స్ చేశారు. క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ కు నాల్గవ రోజు ఈడీ విచారణ ముగిసింది. అనంతరం ఆయనను కలిసిన మీడియా ప్రతినిధుల వద్ద చీకోటి మాట్లాడుతూ.. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానన్నారు. కొందరు తనపై పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ చీకోటి ప్రవీణ్ వారికి హెచ్చరించారు. సోషల్ మీడియాలో తన పేరుతో ఫేక్ ఖాతాలు తెరిచి తప్పుడు పోస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దుష్ప్రచారం చేసే వారిని ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. ఇప్పటికే దీనిపై సీసీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మే వాళ్లు నమ్ముతారు. నమ్మని వాళ్లు నమ్మరని అన్నారు. ఈడీ విచారణ పూర్తి అయిన తరువాత అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు. తాను క్యాసినో నిర్వహించాననీ, దానిలో తప్పేముందని ప్రశ్నించారు. గోవా, నేపాల్ లో చట్టబద్దంగా నడుస్తున్న ప్రదేశాల్లోనే ఇక్కడ నుండి పలువురుని తీసుకువెళ్లినట్లు తెలిపారు. తనకు ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయన్నారు. తాను ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాననీ, భవిష్యత్తులోనూ కొనసాగిస్తానని చెప్పారు చీకోటి ప్రవీణ్. తనకు ప్రాణహాని ఉందని అందుకే రక్షణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చీకోటి తెలిపారు.
చీకోటి ప్రవీణ్ చట్టబద్ద ప్రదేశాల్లో క్యాసినో నిర్వహణ చేసినప్పటికీ హవాలా మార్గంలో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయన్న అభియోగంపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తొంది. ఇటీవల చీకోటి ప్రవీణ్ నివాసంలో ఈడీ అధికారుల తనిఖీల్లో పలు కీలక ఆధారాలు లభించడంతో వాటి ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తొంది. ప్రవీణ్ సెల్ ఫోన్, ల్యాప్ టాప్ ద్వారా అతనితో వ్యాపార లావాదేవీలు ఎవరెవరు నిర్వహించారు తదితర విషయాలపై ఆారా తీస్తున్నారు.