Paddy Procurement: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశం హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ సర్కార్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు రాజ్యసభలో ధాన్యం (బాయిల్డ్ రైస్) కొనుగోలు అంశంపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. వానాకాలం పంటను పూర్తిగా కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు జరుగుతుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు అంశంపై సీఎం కేసిఆర్ తో కూడా చర్చించినట్లు మంత్రి గోయల్ తెలిపారు. ఇంతకు ముందు చేసుకున్న ఒప్పందానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు.
Paddy Procurement: కోటా ధాన్యమే ఇంకా ఇవ్వలేదు
తెలంగాణ రాష్ట్రంలో గతంలో 24 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు ఒప్పందం ఉండేది దాన్ని 44 లక్షల టన్నుల సేకరణకు పెంచడం జరిగిందన్నారు. దాని ప్రకారం ఇప్పటి వరకూ 27 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ తెలంగాణ నుండి వచ్చింది, ఇంకా 17 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ రావాల్సి ఉందని మంత్రి గోయల్ తెలిపారు. అంత ధాన్యం పంపించకుండా పెండింగ్ లో ఉంచిన తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించడం అర్ధరహితమన్నారు. భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయడం కుదరదు అన్న అంశాన్ని గత ఒప్పందంలోనే పేర్కొన్నామని పీయూష్ గోయల్ తెలిపారు. ఇదే అంశంపై పదేపదే ప్రశ్నిస్తూ టీఆర్ఎస్ గందరగోళం సృష్టిస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మరో పక్క ఖరీఫ్ సీజన్ లో 50 లక్షల టన్నుల ధాన్యం ఇస్తామని పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం 32.66 లక్షల టన్నులు మాత్రమే ఇచ్చిందని మంత్రి గోయల్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణ అంశంలో కర్ణాటక ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చాలా బాగుందన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆ నమూనాను పరిశీలించి ఫాలో కావాలని సూచించారు.