క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ గురించి తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యాసినో వ్యవహారంలో ఈడీ అధికారులు ఆయనను విచారించడం, ఆయనతో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు అనేక రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలియడంతో ఆయన కూడా సెలబ్రిటీల సరసన చేరిపోయారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఇన్నోవా కారు చోరీకి గురి కావడం, అంతకు ముందు ఆయన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లుగా సీసీ కెమెరాలో విజ్యూవల్స్ రికార్డు కావడంతో మరో సారి వార్తల్లో నిలిచారు చీకోటి ప్రవీణ్. అయితే కారు చోరీ విషయంపై బుధవారం ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
చీకోటి ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తన కారు చోరీ సాధారణ దొంగతనం కాదని పేర్కొన్న చీకోటి ప్రవీణ్.. తనకు కేసినో ఇండస్ట్రీలోని ప్రత్యర్ధుల నుండి ప్రాణ హాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత కాలంగా తనపై రెక్కీ నిర్వహిస్తున్నారనీ, దీనిపై పోలీసులు విచారణ జరిపి సెక్యురిటీ పెంచాలని కోరారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిసి టార్గెట్ చేశారని ఆరోపించారు. ఈడీ విచారణ మొదలైనప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు.
ఈడీ విచారణ దర్యాప్తులో ఉందన్నారు ప్రవీణ్. తాను క్యాసీనో నిర్వహిస్తున్నాననీ, అది తన ప్రొఫెషన్ అని పేర్కొన్నారు చీకోటి. ప్రభుత్వానికి ట్యాక్స్ లు చెల్లించి లీగల్ ఉన్న దగ్గరే క్యాసినో నడుపుతున్నానని తెలిపారు. అవసరమైతే హిందూత్వం కోసం క్యాసినోను వదులుకోవడానికి కూడా తాను సిద్దమేనని పేర్కొన్నారు. అవకాశం ఉంటే రాజకీయాల్లోకి రావడానికి చూస్తున్నానని తెలిపారు. కారు చోరీపై ఇప్పటికే సైదాబాద్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Garuda bus accident: ఆర్టీసీ గరుడ బస్సు బొల్తా .. పది మందికి గాయాలు