CJI Justice NV Ramana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్ నందు శుక్రవారం తెలంగాణ న్యాయాధికారుల సదస్సు 2022 జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గించాలని భావిస్తుంటారనీ, కానీ తెలంగాణలో కేసిఆర్ మాత్రం 4,320 కిపైగా ఉద్యోగాలను సృష్టించారని అభినందించారు. చేతికి ఎముకలేని తనానికి ట్రైడ్ మార్క్ గా సీఎం కేసిఆర్ అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి కేసిఆర్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఇటీవల హైదరాబాద్ లో అంతర్జాతీయ అర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ వచ్చిందని, వివాదాల సత్వర పరిష్కారానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని జస్టిస్ రమణ అన్నారు.
CJI Justice NV Ramana: సీజేఐ జస్టిస్ వెంకట రమణకు సీఎం కేసిఆర్ కృతజ్ఞతలు
న్యాయవ్యవస్థ ను మరింత బలపరచాలని భావిస్తున్నట్లు సీజేఐ జస్టిస్ ఎన్ వి రమణ తెలిపారు. తెలంగాణ హైకోర్టులో రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న జడ్జిల పెంపు అంశాన్ని పరిష్కరించామన్నారు. జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నామని చెప్పారు. కేసుల సత్వర పరిష్కారానికి జడ్జిల సంఖ్య పెంపు అవసరమని అన్నారు. సీఎం కేసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ను పెంచినందుకు సీజేఐ జస్టిస్ వెంకట రమణకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. న్యాయవ్యవస్థ సమర్ధంగా పని చేయడం కోసం అదనపు సిబ్బందిని మంజూరు చేసినట్లు వివరించారు కేసిఆర్. రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చి 33 జిల్లాలలు ఏర్పాటు చేశామన్నారు. ఆయా జిల్లాల్లో కొత్తగా జిల్లా కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. జిల్లా కోర్టు భవనాల కోసం స్థల సేకరణ జరుగుతోందని, హైకోర్టు జడ్జి లకు హోదాకు తగ్గ స్థాయిలో 42 మంది జడ్జిలకు క్వార్టర్స్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు కేసిఆర్. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తోందని ఈ సందర్భంగా వివరించారు.