భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల సాగుదారులు ఫారెస్ట్ అధికారులపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసిన నేపథ్యంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వెంటనే స్పందించారు. శ్రీనివాసరావు మరణం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అటవీ ఆక్రమణలను సహించేది లేదని హెచ్చరించారు. ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీనివాసరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దోషులకు కఠినంగా శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.
మరణించిన ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50లక్షలు పరిహారాన్ని సీఎం కేసిఆర్ ప్రకటించారు. అంతే కాకుండా డ్యూటీలో ఉన్నప్పుడు శ్రీనివాసరావు కు అందే జీతభత్యాలన్నీ పదవీ విరమణ వయస్సు వచ్చే వరకూ ఆయన కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కారుణ నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం కేసిఆర్ ఆదేశించారు. శ్రీనివాసరావు పార్ధివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్ సోమేష్ కుమార్ కు సీఎం కేసిఆర్ ఆదేశించారు. అంత్యక్రియల్లో పాల్గొనాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ లను సీఎం ఆదేశించారు. ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందనీ, ఎలాంటి భయాలు లేకుండా విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు సీఎం కేసిఆర్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలోని ఎర్రబోడు సమీపంలో అటవీ రేంజ్ అధికారులపై పోడు భూముల సాగుదారులు (గుత్తికోయలు) మంగళవారం కత్తులు, గొడ్డళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో అటవీ రేంజర్ (ఎఫ్ఆర్ఓ) శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడి మృతి చెందగా, బెండాలపాడు అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ రామారావు దాడి నుండి పరారై ప్రాణాలను కాపాడుకున్నారు. అటవీశాఖ నాటిన మొక్కలు తొలగించేందుకు పోడు సాగుదారులు ప్రయత్నించిన క్రమంలో అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు పరిస్థితులు దారి తీశాయి. పోడుభూముల సాగుదారులైన గొత్తికొయలు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేయగా శ్రీనివాసరావు మృతి చెందాడు.
ఐటీ అధికారుల తనిఖీలో కీలక సమాచారం .. మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు ఇంట్లో భారీగా నగదు సీజ్
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?