CM KCR: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి టీఆర్ఎస్ సర్కార్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. దీంతో తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. కేసిఆర్ సర్కార్ను బీజేపీ నేతలు విమర్శిస్తుంటే బీజేపీ నేతలను, కేంద్రంలోని బీజేపీపై కేసిఆర్ విమర్శిస్తున్నారు. కేంద్రం చాలా దారుణంగా వ్యవహరిస్తోందనీ, ఇలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో కూడా చూడకపోవచ్చని కేసిఆర్ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం కొర్రీలు పెడుతోందని ఆరోపించిన కేసిఆర్.. యాసంగి నుంచి తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయమని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో కేసిఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, బీజేపీ రెండు మూడు సీట్లు గెలవగానే ఎగిరెగిరి పడుతోందని కేసిఆర్ అన్నారు. కిషన్ రెడ్డి కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన విషయాన్ని గుర్తు చేసిన కేసిఆర్..ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చారు.
CM KCR: టీఆర్ఎస్ రెబల్ అభ్యర్ధి రవీందర్ సింగ్ వెనుక ఈటల..?
ఇప్పటికే తాము 13 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నామనీ ఒక వేళ ఒకటి రెండు సీట్లు కోల్పోయినా దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేసిఆర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో కేసిఆర్ పొరబాటున టంగ్ స్లిప్ అయి మాట్లాడారా లేక తమకు ఒకటి రెండు ఎమ్మెల్సీ స్థానాలు పోతాయన్న సమాచారంతోనే అలా మాట్లాడారా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్ధిగా సర్దార్ రవీందర్ సింగ్ ఉండగా మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు ఇస్తున్నారు. ఈటల మద్దతు ఉండటం వల్లనే రవీదర్ సింగ్ పోటీ చేస్తున్నారని ప్రచారం ఉంది.
హాట్ టాపిక్ గా మారిన కేసిఆర్ వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కేసిఆర్ కు షాక్ ఇవ్వాలన్న పట్టుదలతోనే ఈటల రాజేందర్ రవీందర్ సింగ్ ను బరిలోకి దించారనీ, అతని గెలుపునకు ఈటల తెరవెనుక ప్రయత్నాలు కూడా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను టీఆర్ఎస్ క్యాంపులకు తరలించింది. మరో వైపు టీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేసినా ఓట్లు మాత్రం తనకే వేయాలని కెప్టెన్ రవీందర్ సింగ్ స్థానిక నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ క్యాంపులో ఉన్న నాయకుల్లో కొందరు రవీందర్ సింగ్ కు ఓటు వేసే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కేసిఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.