CM KCR: మాటల మాంత్రికుడుగా పేరుగాంచిన తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రతిపక్షాలు చేసే విమర్శలకు తన దైనశైలిలో కౌంటర్ ఇస్తుంటారు. ప్రజల్లో తన ఇమేజ్ ను చెదరకుండా చేసుకుంటుంటారు. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తరుణంలోనూ తన మాటల గారడీతో సరి చేసుకోవడం కేసిఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. అదే విధంగా పురాతన కాలం నాటి వరంగల్లు సెంట్రల్ స్థానంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి భవనం నిర్మించాలని కేసిఆర్ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేస్తే పురాతన కాలం నాటి భవనం ఎందుకు కూల్చివేస్తున్నట్లు అంటూ ప్రతిపక్షాలు కేసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత కొంత కాలంగా దీనిపై విమర్శలు చేస్తున్నా కేసిఆర్ ఈ రోజు వరకూ మాట్లాడలేదు. నేడు వరంగల్లులో వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి కేసిఆర్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
Read More: CM KCR Warangal Tour: వరంగల్లులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమిపూజ చేసిన సీఎం కేసిఆర్
జైలును కూలగొట్టడాన్ని కొందరు విమర్శిస్తున్నారని కేసిఆర్ మండిపడ్డారు. జైలుతో సాధారణ పౌరులకు నిత్యం పని ఉండదన్నారు. నగరం మధ్యలో ఆసుపత్రి ఉంటే అందరికీ ఉపయోగమన్నారు. జైలు కూల్చితే నాకేమైనా వచ్చేది ఉందా అని ప్రశ్నించారు. దాదాపు 59 ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి కోట్ల అంచనా వ్యయంతో ఈ మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు చేపడున్నట్లు తెలిపారు. కెనడాలోని ఆసుపత్రుల మాదిరిగా ఈ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందన్నారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని రకాల సౌకర్యాలతో 30 అంతస్తులతో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఈ ఆసుపత్రి పైనే ఎయిర్ అంబులెన్స్ కోసం హెలిపాడ్ ను నిర్మించనున్నారు. వరంగల్లుతో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఈ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందించనున్నది.