CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించిన నాటి నుండి వివిధ రాజకీయ పక్షాల నుండి నేతలు విమర్శలు చేస్తున్నారు. దళితులపై చిత్త శుద్ధితో కేసిఆర్ దళిత బంధు ప్రకటించలేదనీ, కేవలం హూజూరాబాద్ ఉప ఎన్నికలలో లబ్దిపొందేందుకు దళిత జపం చేస్తున్నారనీ, గతంలో దళితుడిని సీఎం చేస్తామని ప్రకటించారు. ఆ తరువాత దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఆ రెండు వాగ్దానాల మాదిరిగానే దళిత బంధు మిగిలిపోతుంది అంటూ పలు రకాలుగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో హూజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని శాలపల్లి గ్రామంలో సోమవారం దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించిన కేసిఆర్ ప్రతిపక్షాల విమర్శలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే తాము అమలు చేస్తున్న రైతు బంధు పథకం విజయవంతంగా నడుస్తోందనీ, రైతాంగంలో ఎంతో సంతోషం కనిపిస్తోందని అన్నారు. ఇప్పుడు దళిత బంధు అదే రీతిలో విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేసిన సీఎం కేసిఆర్.. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందన్నారు. దళిత బంధు పథకంతో మరో నాలుగేళ్లలో అద్భుత ఫలితాలు వస్తాయన్నారు.
ఏడాది క్రితమే ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకున్నా కానీ కరోనా కారణంగ ఏడాది ఆలస్యం అయ్యిందన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని చూసి మిగతా రాష్ట్రాలు నేర్చుకుంటున్నాయన్నారు. ఈ పథకం ద్వారా చిత్తశుద్ధి ఉంటే ఎంతటి లక్ష్యమైనా సాధించవచ్చని నిరూపించామని పేర్కొన్నారు. ఇతర పార్టీలకు రాజకీయాలు అంటే ఓ ఆట అని, టిఆర్ఎస్ పార్టీకి మాత్రం సామాజిక అభివృద్ధే లక్ష్యమని స్పష్టం చేశారు. సామాజిక లక్ష్యాలను అందుకోవడం టీఆర్ఎస్ పార్టీ పవిత్ర కర్తవ్యం అని, దళిత బంధును విజయవంతం చేయడంలోనూ అదే రీతిన కృషి చేస్తామని చెప్పారు.
హూజూరాబాద్ నియోజకవర్గంలో 21 వేల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయనీ, ప్రతి ఎస్సీ కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు కాంగ్రెస్, బీజేపీ ప్రధానులు ఇలాంటి పథకాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన కేసిఆర్.. ఇప్పటి వరకూ ఆ ఆలోచనే చేయని నేతలు ఇవాళ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 17 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయనీ, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న కుటుంబాలకు కూడా దళిత బంధు వర్తింపజేస్తామన్నారు.
తాను దళిత బంధు పథకాన్ని ప్రకటించానో లేదో కిరికిరిగాళ్లు, కొండెగాళ్లు ఒకరు కీ అంటే ఒకరు కా అంటే..ఒకడు ఇంత ఇవ్వాలంటే, ఇంకొకడు అంత ఇవ్వాలంటే అందరూ దుకాణం మొదలు పెట్టారు అని విమర్శించారు. ఏనాడూ రూపాయలు ఇవ్వాలని మాట్లాడని వాడు కూడా ఇవాళ మాట్లాడుతున్నాడు అంటూ కేసిఆర్ వ్యాఖ్యానించారు. ఇచ్చేవాడు ఇస్తాడు ..తీసుకునే వాడు తీసుకుంటాడు.. మధ్యలో వాళ్లకు ఏంటి కడుపుమంట అంటూ కేసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు