బీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ (ఎంపీలు) సభ్యులను ఆ పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ ఇవేళ ప్రగతి భవన్ లో భోజనాలకు ఆహ్వానించారు. ఎంపీలను భోజనాలకు ఆహ్వానించడానికి కారణం ఏమిటంటే .. ఇవేళ మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రగతి భవన్ లో సీఎం, పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఎంపీలను భోజనాలకు ఆహ్వానించారు. మధ్యాహ్నం భోజనాల అనంతరం సమావేశం నిర్వహించనున్నారు.
జాతీయ పార్టీగా పార్లమెంట్ లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు ఈ సమావేశంలో కేసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై పోరాడుతూనే దేశ వ్యాప్తం అంశాలపై స్పందించే విధంగా వ్యూహాలను రూపొందిస్తున్నారు. జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ నిర్వహించగా విజయవంతం అయ్యింది. ఇదే ఊపుతో రెండవ బహిరంగ సభ మహారాష్ట్రలో నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నద్దం అయిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని నాందేడ్ లో ఫిబ్రవరి 5వ తేదీన భారీ ఎత్తున బహిరంగ నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. బహిరంగ సభ ఏర్పాట్లను ఆ పార్టీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభలకు పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. ఈ బహిరంగ సభలో వివిధ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలను ఆహ్వానించే అంశంపైనా పార్లమెంట్ సభ్యులతో కేసిఆర్ చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ నెల 31వ తేదీ నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 31వ తేదీ ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో ఏప్రిల్ 6వ తేదీ వరకూ సాగుతాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఆ వెంటనే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్ధిక సర్వేను పార్లమెంట్ ముందు ఉంచుతారు. రెండో రోజైన ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ను ఆర్దిక మంత్రి సమర్పిస్తారు.
KTR: కేంద్రంలోని బీజేపీకి తెలంగాణ మంత్రి కేటిఆర్ కీలక సవాల్ ..ముందస్తుపై క్లారిటీ ఇచ్చేశారు(గా)