తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ (వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు) పై ప్రజానీకం నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో కేసిఆర్ సర్కార్ ఎల్ఆర్ఎస్ విషయంలో కొంత వెనక్కు తగ్గింది. మంగళవారం సాయంత్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఎల్ ఆర్ ఎస్ తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ లు చేసుకోవచ్చని ఇప్పటి వరకూ ఉన్న ఆ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఎల్ ఆర్ ఎస్ అనుమతి పొందినవాటికి రిజిస్ట్రేషన్లు కొనసాగించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కొత్తగా వేసిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఖచ్చితంగా ఉండాల్సిందేనని, సంబంధిత సంస్థల అప్రూవల్ పొందిన తరువాతే రిజిస్ట్రేషన్ ఉంటుందని ఉత్తర్వులో పేర్కొంది. ఈ తాజా ఆదేశాలతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలగినట్లు అయ్యింది. అయితే ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ లు చేస్తామని చెప్పినప్పటికీ, ఎల్ఆర్ఎస్ పూర్తిగా రద్దు చేసినట్లు మాత్రం ప్రభుత్వం ప్రకటించలేదు. అంటే చార్జీలను భవిష్యత్తులో అయినా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొని ఉంటుంది.
ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం 25.59 లక్షల ధరఖాస్తులు వచ్చాయి. రిజిస్ట్రేషన్ లు నిలిచిపోవడంతో ఆయా ప్లాట్ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రకాల ఆర్థిక ఇబ్బందుల కోసం అవసరమైన నగదును సమకూర్చుకోవాలంటే ప్లాట్లను విక్రయించుకోకతప్పని సరి పరిస్థితి కాగా ఎల్ఆర్ఎస్ నిబంధనలతో ప్లాట్లలను విక్రయించుకోలేక పోతున్నామని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ ధరఖాస్తు చేసిన రసీదు ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించి క్రయ విక్రయాలు జరిగేందుకు కేసిఆర్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది.