Telangana Lock Down: తెలంగాణలో లాక్ డౌన్ అనే మాట ఉండదు. ఇదే విషయాన్ని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా తెలంగాణలోనూ లాక్ డౌన్ విధిస్తారంటూ వదంతులు వస్తున్నాయి. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం, హైకోర్టు కూడా ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేసిన నేఫథ్యంలో లాక్ డౌన్ విధిస్తారంటూ ప్రచారం జరుగుతోంది,. ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో లాక్ డౌన్ లు, కర్ఫ్యూ లాంటి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా కోర్టు సూచనలతో లాక్ డౌన్ పెట్టవచ్చేమో అని అందరూ భావిస్తూ వస్తున్నారు.
అయితే దీనిపై నేడు క్లారిటీ వచ్చేసింది. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడి పూర్తిగా కొలుకున్న సీఎం కేసిఆర్ నేడు ప్రగతి భవన్ కు చేరుకున్నారు. రాష్ట్రంలో కరోనా కరోనా పరిస్థితులపై సీఎం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై సుమారు నాలుగు గంటల పాటు అధికారులతో చర్చించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు.
ఇదే సందర్భంలో లాక్ డౌన్ అంశంపై క్లారిటీ ఇచ్చారు. లాక్ డౌన్ విదించిన రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గిన దాఖలాలు లేవన్నారు. లాక్ డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థకుప్పకూలడమే కాక జన జీవనం స్తంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. కరోనా కేసులను నిరోధించడానికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని అన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు.