CM KCR: తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ ఎత్తున ఉద్యోగ ఖాళీల భర్తీకి కేసిఆర్ సర్కార్ చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను కేసిఆర్ ఆదేశించారు. ఉద్యోగ ఖాళీల భర్తీపై సీఎం కేసిఆర్ అధ్యక్షతన నేడు ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. తొలి దశలో అన్ని శాఖల్లో కలిపి 50వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రెండవ దశలో ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం కేసిఆర్ ఆదేశించారు.
రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోదముద్ర లభించడంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయాయన్నారు. నేరుగా నింపే అవకాశాలు ఉన్న అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50వేల వరకూ ఖాళీగా ఉన్నాయనీ, వాటిని ముందుగా భర్తీ చేస్తామని కేసిఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందనీ, ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను కూడా గుర్తించి భర్తీ చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన నివేదికను సిద్ధం చేసి కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని సీఎం కేసిఆర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శి రాజశేఖరరెడ్డి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ నెల 13న మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యవసాయం, పల్లె, పట్టణ ప్రగతి తదితర అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది.