CM KCR: మాటల మాంత్రికుడుగా పేరుగాంచిన తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రతిపక్షాల నుండి ఎన్ని రకాలుగా విమర్శలు వస్తున్నా ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకుంటుంటారు. తన దైన శైలిలో మాట్లాడటం, కీలక నిర్ణయాలతో మాస్ ఫాలోయింగ్ చెదిరిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదే క్రమంలో ఉద్యోగుల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఆయా సంఘాలతో చర్చించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు అన్న చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు క్షేత్ర స్థాయి ఆసుపత్రుల పరిశీలన కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. కరోనా వ్యాధి గ్రస్తుల వద్దకు కుటుంబ సభ్యులే వెళ్లడానికి భయపడుతున్న ప్రస్తుత తరుణంలో కేసిఆర్ కేవలం డబుల్ మాస్క్ ధరించి రోగుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. మొన్న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో రోగులను పరామర్శించి, వైద్య సదుపాయాలపై వైద్యాధికారులతో సమీక్ష జరిపిన సీఎం కేసిఆర్ నేడు వరంగల్లు ఎంజీఎంను సందర్శించారు. పీపీఈ కిట్ సైతం ధరించకుండా కేసిఆర్ ఆసుపత్రిలోని వార్డుల్లో కలియతిరిగి రోగులను పరామర్శించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కోవిడ్ రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. భాధితులకు తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదనీ, బీమార్ తగ్గిపోతుందంటూ ధైర్యం చెప్పారు. హాస్పటల్ లో బెడ్స్, ఆక్సిజన్, మందుల కొరత తదితర విషయాలపై వైద్యాధికారులతో కేసిఆర్ చర్చించారు. రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత వరంగల్లులో కోవిడ్ కేసులు అధికంగా నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ ఆసుపత్రులపై దృష్టి సారించారు. రోగులకు వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కరోనా రోగులను పరామర్శిస్తుండటం పల్ల సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సీఎం కేసిఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ తదితరులు ఉన్నారు.