తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దాదాపు క్లోజ్ అయ్యేటట్టు కనబడుతోంది. దుబ్బాక అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కనీస ఓట్లు రాబట్టే పరిస్థితిలో కూడా పార్టీ లేకపోవటంతో ఆ పార్టీలో ఉన్న నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా గ్రూపు రాజకీయాలు అదేవిధంగా హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకులకు పెద్దగా ఇమడటం లేదు.
ఇప్పటికే పార్టీలో కీలక నేతగా ఉన్న విజయశాంతి బీజేపీలో చేరిన పరిస్థితి ఉంటే తాజాగా టీ కాంగ్రెస్ కు మరో దెబ్బ తగిలేలా ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారని వార్తలు సూచిస్తున్నాయి. ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో టిఆర్ఎస్ కు బిజెపినే ప్రత్యామ్నాయమని, మొదటగా తానే చెప్పానని ఆయన అన్నారు.
బిజెపి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలు పిసిసి అద్యక్ష పదవికి పోటీ పడుతున్నారని, ఎవరైనా అదిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి కి ఫెవర్ గా మాట్లాడటం తో ఆయన పార్టీ మారటం గ్యారెంటీ అని అంటున్నారు.