తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తున్న వ్యవహారానికి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెరదించారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సందర్భంలో టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసిఆర్ పై మరో సారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని విమర్శించారు. గత కొద్ది రోజులుగా ఆయన రాజీనామా అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పార్టీకి రాజీనామా చేసి బీజేపీ లో చేరడానికి సిద్ధమైన రాజగోపాల్ రెడ్డి కొద్ది రోజులుగా నియోజకవర్గంలోని తన అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశాలు జరిపి తన నిర్ణయాన్ని తెలియజేస్తూ, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇదే క్రమంలో రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మంతనాలు జరిపారు. పార్టీ హైకమాండ్ నుండి చర్చించేందుకు రావాలని రాజగోపాల్ రెడ్డికి ఆహ్వానించినా ఆయన స్పందించలేదు. సోమవారం రాత్రి కూడా ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డి అంశంపై పార్టీ పెద్దలతో చర్చించారు.
ఈ తరుణంలో మంగళవారం సాయంత్రం రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని ప్రకటించారు. స్పీకర్ ను కలిసి రాజీనామా సమర్పిస్తానని తెలిపారు రాజగోపాల్ రెడ్డి. నియోజకవర్గ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్న తరువాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. తన రాజీనామాపై చర్చ రోజురోజుకు పక్కదారి పడుతోందన్నారు. ఎక్కువ రోజులు నాన్చే ఉద్దేశం తనకు లేదని అందుకే తన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో అనేక మార్లు ప్రస్తావించానని అయినా ఫలితం లేదన్నారు.
నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కేసిఆర్ కలిసేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేదన్నారు. ఒక కుటుంబం మాత్రమే తెలంగాణలో పని చేస్తోందనీ, ఆ కుటుంబం కోసమే మంత్రివర్గం నుండి అధికార వర్గం వరకూ పని చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైందని అన్నారు. కేసిఆర్ నయాం నిజాంలాగా పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ కి చెందిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా సమస్యలు ఉన్నాయన్నారు. ఉప ఎన్నిక వచ్చిన హుజూరాబాద్ లోనే దళితబంధు అమలు చేశారన్నారు. తాను అనుకున్న స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానని అన్నారు రాజగోపాల్ రెడ్డి.
తన రాజీనామాతో అయినా నియోజకవర్గంలో ఫించన్లు, రేషన్ కార్డులు ఇస్తారన్న ఆశ ఉందన్నారు రాజగోపాల్ రెడ్డి. తన ప్రతిష్ఠ ను దెబ్బతీసేందుకు సొంత పార్టీలోనూ, బయట కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పదవుల కోసం, కాంట్రాక్ట్ ల కోసమే అయితే టీఆర్ఎస్ పార్టీలో చేరేవాడినని అన్నారు. తాను ప్రజల కోసమే రాజీనామా చేయడానికి సిద్ధమయ్యానని చెప్పారు. ఉప ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకుంటారో మునుగోడు ప్రజలు నిర్ణయించుకుంటారని తెలిపారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుండి వెళ్లిపోయినా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదని అన్నారు.
కొన్ని తప్పుడు నిర్ణయాలతో కాంగ్రెస్ రాష్ట్రంలో బలహీనపడిందని పేర్కొన్నారు రాజగోపాల్ రెడ్డి. 20 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్న తాము ఇతర పార్టీల నుండి వచ్చిన వ్యక్తుల కింద పని చేయాలా అని ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి. సోనియాను విమర్శించిన వాళ్లు తమకు నీతులు చెప్పడం ఏమిటని అన్నారు. కమిటీలు వేసే సమయంలో కనీసం తమను సంప్రదించలేదనీ, ఇంత కన్నా అవమానం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పై కాంగ్రెస్ సరైన పోరాటం చేయడం లేదని అన్నారు. మోడీ నాయకత్వంలో దేశం దూసుకుపోతోందనీ, దేశ ప్రజలు అందరూ మోడీ వైపే చూస్తున్నారని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే బీజేపీ వల్లే సాధ్యమని అన్నారు.
మోడీ ఇలాకాలో జెండా పాతేందుకు ఆప్ అధినేత కేజ్రీవాల్ కీలక హామీలు