తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన సోదరుడు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేరువేరుగా నేడు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరికపై ముహూర్తం ఖరారు చేసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ నెల 21వ తేదీన అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం మరువకముందే మరో సీనియర్ కాంగ్రెస్ నేత దోసోజు శ్రావణ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మరో పక్క టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత టీ కాంగ్రెస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై భూవనగిరి పార్లమెంట్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ని తనకు తెలియకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని తప్పుబట్టారు. ఇదే సందర్భంలో అమిత్ షా ను కలిసిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు రూ.1400 కోట్ల నష్టం జరిగిందన్నారు. 377 కింద లోక్ సభలో వరద నష్టంపై ప్రస్తావించానని చెప్పారు. తెలంగాణలో ఏరియల్ సర్వే చేయాలని కోరానని, పదవుల కోసం వెంటపడే వాడిని కాదని అన్నారు. తనకు బెస్ట్ ఎంపీ అవార్డు వస్తుందన్నారు. కేంద్రం నుండి చాలా నిధులను తీసుకువచ్చానన్నారు.
దాసోజు శ్రావణ్ లాంటి మేధావిని పార్టీ నుండి వెళ్లగొడుతున్నారనీ, తనను కూడా పార్టీ నుండి వెళ్లగొట్టేందుకు యత్నిస్తున్నారని వెంకటరెడ్డి ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తనకు తెలుసునని అన్నారు. తనకు తెలియకుండానే తన నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు వెంకటరెడ్డి. తనకు తెలియకుండా చుండూరులో సభ పెడితే తాను వెళ్లాలా అని ప్రశ్నించారు. తనను రూపాయి ఖర్చు పెట్టకుండా ఎంపిగా జనం గెలిపించారన్నారు. పార్టీ మారుతున్నానంటూ కూడా ప్రచారం చేస్తున్నారని అన్నారు. పాత కాంగ్రెస్ వాళ్లందరినీ పార్టీ నుండి వెళ్లగొడుతున్నాడంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వెదవ పనులు చేస్తున్నారనీ, దీనిపై సోనియా, రాహుల్ గాంధీ దగ్గర తేల్చుకుంటానని వ్యాఖ్యానించారు. వెంకటరెడ్డి. కాంగ్రెస్ వాళ్లంతా పోతే .. టీడీపీ వాళ్లను చేర్చుకుంటారని అన్నారు. తాను పార్టీ మారేది ఉంటే బరాబర్ చెప్పి వెళ్తానని, ఎవరికీ భయపడనని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. హూజూరాబాద్ లో రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా స్పందించలేదని, అక్కడ ఎన్ని రోజుల తర్వాత సభ పెట్టారని ప్రశ్నించారు.